Kothagudem MLA : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభలో అధికార విపక్షాలు ఏఏ అంశాలపై చర్చిస్తాయి అన్న దానికంటే ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సభకు హాజరయ్యేది వనమా వెంకటేవ్వర రావా? లేక జలగం వెంకట్రావా? అన్నది ఎక్కువ ఉత్కంఠగా ఉంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేస్తూ.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో సభకు ఎవరు వస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి.. మరోవైపు కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపైనే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరిలో ఎవరు హాజరవుతారనేది తేలనుంది.
సాధారణంగా హైకోర్టు తీర్పు కాపీ అధికారికంగా స్పీకర్కు చేరిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. దానిన ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేస్తుంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు.
కోర్టు తీర్పుతో మాజీగా మారిన వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. కానీ వెంకట్రావు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఒకవేళ జలగంతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆయన సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.