BRS: ఎమ్మెల్యేల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. గులాబీ బాస్కు ఇది బిగ్ టాస్క్లానే మారింది. ఇప్పటికే కారు ఫుల్ ఓవర్లోడ్తో ఉంది. చాలామందికి ఎమ్మెల్సీ ఆఫర్లు ఇచ్చి ఉన్నారు కేసీఆర్. జిల్లాకు ఓ ఇద్దరు ముగ్గురికైనా ఎమ్మెల్సీని చేస్తానంటూ రాజకీయంగా వారిని కారులో బంధించి ఉంచారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. భారీగా ఆశావహులు ఉన్నారు. అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఉన్నవి ముచ్చటగా మూడు స్థానాలే. మరి, ఆ ముగ్గురు కాబోయే ఎమ్మెల్సీలు ఎవరు?
తాజా మాజీ నవీన్ రావుకు మళ్లీ ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు కావడంతో.. నవీన్రావుకు మరోసారి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇక మిగిలింది రెండే సీట్లే. ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనేది ఆసక్తికరం.
రేసులో చాలామందే ఉన్నారు. ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలుద్దామంటే.. ఎంట్రీ ఉండదాయె. గులాబీ బాస్ ఎవరి మాటా వినరు కాబట్టి.. పైరవీలకూ నో ఛాన్స్. ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేస్తారనే టెన్షన్ వారిని వేధిస్తోంది.
ప్రస్తుతం ఖమ్మం బీఆర్ఎస్లో తీవ్ర అలజడి ఉంది. బలమైన నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కారు దిగి వెళ్లిపోయారు. జిల్లాలో నాలుగైదు స్థానాలను ప్రభావితం చేయగల సత్తా ఆయనది. మరి, పొంగులేటి ఎఫెక్ట్ ఉమ్మడి ఖమ్మంపై పడకుండా ఉండాలంటే.. తుమ్మల నాగేశ్వరరావులాంటి సీనియర్ నేత అండ అవసరం. ఇన్నాళ్లూ తుమ్మలను పట్టించుకోకుండా పక్కన పెట్టేసినా.. ఇటీవలి ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఆయనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పొంగులేటి దూకుడును అడ్డుకోడానికి.. ఈసారి తుమ్మలను ఎమ్మెల్సీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక, ఏ పదవులు భర్తీ చేసినా బీసీ కేండిడేట్ ఉండాల్సిందే. హోరాహోరీగా సాగిన మునుగోడు ఎన్నికల సమయంలో.. ఎమ్మెల్సీ హామీతో ముగ్గురు కీలక నేతలకు గులాబీ కండువా కప్పేశారు. వారంతా ఇప్పుడు ఆ పదవి కోసం ఆశగా చూస్తున్నారు. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్తో పాటు భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణ్లు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిద్దరికి ఎమ్మెల్సీ వరిస్తుందని అంటున్నారు.
వీరే కాకుండా కడియం శ్రీహరి నుంచి గ్యాదరి బాలమల్లు వరకు.. అనేక మంది ఎమ్మెల్సీ పదవి కోసం చకోరా పక్షిలా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. దేవి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్లు సైతం తమను ఈసారైనా ఎమ్మెల్సీ చేయకపోతారా.. అని తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. మరి, ఎవరి అంచనాలకూ అందని కేసీఆర్.. ఈసారి ఎవరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తారో అనే టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.