తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేతపై చర్చిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. అందులో ఆరుగురు కొత్తవారే ఉన్నారు. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మాత్రమే ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి కాకుంటే కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట రమణారెడ్డికి ఛాన్స్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం రాజాసింగ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించే యోచనలో ఉంది బీజేపీ. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా ఉండడంతో తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారా.. లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.