హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం హాట్ సీట్గా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ లోనూ టికెట్ ఫైట్ నెలకొంది. గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. ఆయనపై నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లోకల్ లీడర్లు గులాబీ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా మాగంటి వ్యవహర శైలిపైన స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత వస్తోంది. మాట వినని సొంత పార్టీ లీడర్లపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా లోకల్ లీడర్లు కట్టిన ప్లెక్సీల్లో తన ఫొటో పెద్దగా ముద్రించలేదని కోపంతో ఊగిపోయారు మాగంటి. సొంత పార్టీ లీడర్ ఇంటికి వెళ్లి దాడి చేయడం కూడా దుమారం రేపింది. దీనిపై బాధితుడు కేసు పెట్టినా పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. చివరికి కోర్టు జోక్యంతో కేసు నమోదు చేశారు.
మాగంటిపై స్థానికంగా ఉన్న లీడర్లు ఏం అనుకుంటున్నారు? ఆయన లీడర్లతో ఏ విధంగా ఉంటున్నారు? అనే విషయాలపై నిఘా వర్గాలు ప్రగతిభవన్కు ఓ రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. అందులో మెజార్టీ లోకల్ లీడర్లు మాగంటికి మళ్లీ టికెట్ ఇవ్వొద్దని అభిప్రాయపడినట్టు ప్రచారం జరగుతోంది. ఏ విధంగా వేధింపులకు గురిచేస్తున్నారు? మాగంటి శైలి కారణంగా ఎంత మంది పార్టీ మారారు? అనే పూర్తి వివరాలను కేటీఆర్కు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం ఉంది.
ఇక జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ లోనూ ఫైట్ నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఆ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ రంగంలోకి దిగారు. తాజాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి అజారుద్దీన్ రావడంతో ఆయన్ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు, అభిమానులు అడ్డుకున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులకు సమాచారం ఇవ్వకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులపై సీరియస్ అయ్యారు అజారుద్దీన్. మాజీ ఎంపీ అయిన అజారుద్దీన్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఏం పని చేస్తున్నారని పోలీసులను కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో తిరిగి వెళ్లిపోయారు అజారుద్దీన్.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటనపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్ తమకు చెప్పి రాకపోవడం తప్పుగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ తండ్రి పి.జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. తాను కూడా 16 ఏళ్ల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడుతున్నాని చెప్పారు. తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.