White Paper War in Telangana Assembly : బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. వాటన్నింటినీ జనం ముందు ఉంచుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మేడిగడ్డపైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ.. మూడేళ్లకే నాణ్యతా లోపంతో కుంగిపోయింది. స్వాతంత్ర్య భారతంలో ఎక్కడా ఇంత పెద్ద స్కామ్ జరగలేదన్నారు. మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టునే సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. మేడిగడ్డలోనే కాదు.. అన్నారం బ్యారేజీలోనూ లీకేజీలు మొదలయ్యాయని సంచలన నిజాలని బయటపెట్టింది.
ఈ బ్యారేజీ కూడా కుంగిపోయే అవకాశాలు లేకపోలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్, నాణ్యతా లోపం, అవినీతి కారణంగానే కాళేశ్వరం దెబ్బతింటోందనేది ప్రభుత్వ వాదన. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం.. మేడిగడ్డ నిరుపయోగమని తేల్చి చెప్పింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగిపోతే.. మిగతా వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందన్నారు ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి డ్యామ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. బ్యారేజీలో అన్ని మోటార్లు పనిచేస్తే.. రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. రాష్ట్రం మొత్తం అవసరాలకు 160 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరమైతే.. ఒక్క కాళేశ్వరానికే 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేశారని కేసీఆర్ పై మండిపడ్డారు. విజిలెన్స్, కాగ్ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Read more: జల దోపిడీ సహించం..!
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదని.. కానీ, ఇప్పుడు మీరు తప్పుకుంటే తామే బాగు చేస్తామని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిజానికి మీకు ఇంకా ఆ అర్హత ఉందని అనుకుంటున్నారా? అని ఎద్దేవ చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చాక.. సంబంధిత మంత్రి కనీసం ప్రకటన కూడా చేయలేదని గుర్తు చేశారు ఉత్తమ్. మేడిగడ్డలో నీళ్లు నిల్వ ఉంచితే ప్రమాదమని తెలిశాక.. బీఆర్ఎస్ దానిని ఖాళీ చేసిందన్నారు. ఇప్పుడు కాళేశ్వరంపై మాట్లాడుతుంటే.. గులాబీ నేతలు తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ఫైరయ్యారు. ఇంకా 50 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయని.. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాటిపోయిందన్నారు మంత్రి.
సాగునీటి రంగంలో విధ్వంసకరమైన విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. గత 10 ఏళ్లలో నీటి దోపిడీ పదింతలు పెరిగిందన్న ఆయన.. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు నీటి విషయంలో తీవ్ర నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం టెండర్లు రూ.1,800 కోట్లు అయితే.. అంచనా వ్యయం రూ.4,500 కోట్లకు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకే వేలకోట్లను కట్టబెట్టి.. నాణ్యతను గాలికి వదిలేసిందని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు అడుగుభాగం నుంచీ ఏపీ నీళ్లు తీసుకెళ్తున్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.1.75 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. బీఆర్ఎస్ నిర్ణయాలు తెలంగాణను నట్టేట ముంచాయన్న ఉత్తమ్.. ప్రాజెక్టులకు ఇప్పుడు విపరీతంగా ఖర్చవుతుందని, గతంతో పోలిస్తే ఎకరానికి రూ.12 కోట్ల మేర అవసరమని తెలిపారు.