KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఆసక్తికరంగా సాగాయి. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. అదే సమయంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. ముఖ్యంగా తన ప్రసంగంలో పదేపదే బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించారు. రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ ఈటల ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెట్టామని చెప్పారు. మరో సందర్భంలో కేంద్రం ఎన్నికుట్రలు చేసిందో ఈటల సహా అందరికీ తెలుసన్నారు. అలాగే ఈటల సభలో అనేక విషయాలను ప్రస్తావించారని వాటిని స్వాగతిస్తామని వాటిపై చర్చిస్తామని కేసీఆర్ చెప్పడం ఆసక్తిని రేపింది.
వ్యూహమేంటి?
కేసీఆర్ ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికో రాజకీయ లెక్క పక్కాగా ఉంటుంది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఈటల పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ …ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పేరును వ్యూహాత్మకంగానే ప్రస్తావించారని అర్థమవుతోంది. గులాబీ బాస్.. ఈటలను మళ్లీ పార్టీలోకి తీసుకునే యోచన చేస్తున్నారా? అందుకు అసెంబ్లీ వేదికగానే అడుగులు వేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారణమిదేనా..?
బీజేపీ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ బలపడాలని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అక్కడ నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోయారు. అక్కడ ఆమే స్వయంగా సువేందు అధికారిని కట్టడి చేసేందుకు పోటీకి దిగారు. దీంతో బెంగాల్ బలమైన నాయకుడైన సువేందు అధికారి రాష్ట్రం మొత్తం ప్రచారం చేపట్టలేకపోయారు. తన నియోజకవర్గంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు. చివరికి ఆయన గెలిచినా రాష్ట్రంలో మాత్రం టీఎంసీ అధికారంలోకి వచ్చింది.
మమత అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ యోచిస్తోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ ను పోటీకి దించాలని బీజేపీ యోచిస్తోంది. కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల ఇప్పటికే ప్రకటించారు. కేసీఆర్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఒకవేళ గజ్వేల్ లో ఈటల బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రం మొత్తం ఫోకస్ ఈ నియోజకవర్గంపైనే ఉంటుంది. గులాబీబాస్ కూడా విజయం కోసం కష్టపడాల్సి రావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా? ఈటలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే యోచన చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
గెంటేశారు.. బీజేపీలోనో కొనసాగుతా..
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే అలా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తన పేరు చెప్పగానే పొంగిపోనని స్పష్టం చేశారు. తనపై చేసిన దాడిని మరిచిపోను అని అన్నారు. తాను పార్టీ మారలేదని గెంటేశారని గుర్తు చేశారు. గెంటేసిన వాళ్లు పిలిచినా వెళ్లనని తేల్చిచెప్పారు. తన చరిత్ర తెలిసిన వారు ఎవరూ తనను తక్కువ అంచనా వేయరని తెలిపారు. టీఆర్ఎస్ లో సైనికుడిగా పనిచేశానని బీజేపీలో కూడా సైనికుడిగా పనిచేస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఈటల దారెటు..?
గతంలో ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శించేవారు. ఈ మధ్య గులాబీ నేతల నుంచి ఈటలపై విమర్శలు అంతగా లేవు. అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు కేటీఆర్ .. ఈటల వద్దకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఆయన పేరును పదే పదే ప్రస్తావించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈటలను పార్టీలోకి మళ్లీ తీసుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈటల బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. కేసీఆర్ కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆయనను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి మళ్లీ రమ్మంటే ఈటల వెళ్లననే చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు. మరి ఈటల ఇప్పుడు చెప్పినట్టే బీజేపీలో కొనసాగుతారా? గులాబీ బాస్ నుంచి ఆహ్వానం అందించే సొంతగూటికి వెళ్లిపోతారా ? చూడాలి ఏం జరుగుతుందో..!