BJP : తెలంగాణ ఎన్నికల రేసులో బీజేపీ ప్రయాణం నత్తనడకన సాగుతోంది. ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు నెలలుగా కాషాయ పార్టీ ప్రతి విషయంలో వెనుకడుగే వేస్తోంది. అందుకే పార్టీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉందనే అంటున్నారు. అయినా సరే అదే నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ చివరిరోజు కూడా అభ్యర్థులను ప్రకటించింది.
నామినేషన్ల చివరిరోజు 14 మంది అభ్యర్థుల ఐదో జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. అయితే గతంలో ప్రకటించిన కొందరి అభ్యర్థులకు పార్టీ షాకిచ్చింది. వనపర్తి, బెల్లంపల్లి, చాంద్రాయణగుట్ట అభ్యర్థులను మార్చేసింది. పేర్లలో పొరపాటు జరిగిందంటూ మళ్లీ బెల్లంపల్లిలో తొలుత ప్రకటించిన శ్రీదేవికే టిక్కెట్ ఇచ్చింది. వనపర్తిలో అశ్వత్థామరెడ్డికి బదులు అనగ్నరెడ్డిని బరిలోకి దింపింది.
ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తి సెగలు రగిలే అవకాశముందన్న వ్యూహంతోనే ఆలస్యంగా బీజేపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయినాసరే కచ్చితంగా టిక్కెట్ దక్కే నేతలు కూడా పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి.. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ పరిణామాలతో బీజేపీ మరింత ఢిపెన్స్ లో పడింది. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేసింది.
తెలంగాణలో ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ బీజేపీ ఇప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించలేదు. దీనిపై కాషాయ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ ప్రచారం కూడా చప్పగా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీపై సాప్ట్ కార్నర్ తో వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యాపేట సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా.. హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించలేదు. మేడిగడ్డ , అన్నారం బ్యారేజ్ లు దెబ్బతిన్న ఘటనపై నోరు విప్పలేదు. ఈ అంశాలే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ విమర్శలకు బలం చేకూరుస్తోంది.
.
.