తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. రెండురోజులుగా రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై.. వర్షం దంచికొడుతోంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోంది. మాదాపూర్లో 3.25 సెంటిమీటర్లు, కూకట్పల్లిలో 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మద్దుకూరులో 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్ లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, లింగపల్లిలో 4 సెంటీమీటర్లు వర్షం పడింది.