Heavy Rains for Telangana and AP: తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. నైరుతి రుతపవనాలు బలపడటం, దానికి తోడు అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. నేటి నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు బలపడటం.. దానికి తోడు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాలు జులై 18 వరకు కురుస్తాయని చెప్పారు.
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. బలమైన నైరుతి రుతుపవనాలు.. వాటికి తోడు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగనున్నదని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని, పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
Also Read: బండి సంజయ్కు పొన్నం బహిరంగ లేఖ.. ‘కరీంనగర్ బిడ్డగా..’
ఏపీలోనూ భారీ వర్షాలు
ఏపీలో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రాంలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతరామారాజు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అదేవిధంగా రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.