August 22nd Telangana Weather Report : తెలంగాణను వర్షాలు.. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా వెంటాడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రెండు గంటల పాటు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన వర్షానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఓ వ్యక్తి ఆ వర్షపు నీటిలో మరణించాడు.
రాష్ట్రంలో వాతావరణం విషయానికొస్తే కాస్త భిన్నంగానే ఉంటోంది. పగలు ఎండ, సాయంత్రమైతే అనూహ్యంగా కారుమబ్బులు కమ్మి వర్షాలు కురవడం.. వారంరోజులుగా ఇదే జరుగుతోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ఉదయం పూరీ – చిలుకా లేక్ మధ్య తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: మహిళల రక్షణకు ప్రత్యేక బడ్జెట్!
నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే.. రోజు మాదిరిగానే సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. నగరానికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మేయర్ విజయలక్ష్మి అధికారులకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.