Rain news updates in telugu states(Today news paper telugu): అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. అటు, ఏపీలో కూడా రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.
భారీ వర్షాలతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. రాత్రి నుంచి వర్షం దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటిమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారయంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలోని 70కిపైగా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
భారీ వర్షాలకు ములుగు జిల్లాలో వాగు పొంగిపొర్లుతున్నాయి. తాడ్వాయి మండలంలోని జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నార్లపూరం గ్రామపంచాయితీలోని పడిగాపుర్, ఎలుబాక గ్రామాలు గత నాలుగు రోజులుగా జదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకుంది. మరో అడుగు పెరిగి 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీయ చేయనున్నారు అధికారులు.
భద్రాద్రి జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ఆళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రధాన రహదారులు చెరువలను తలపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజులకు ముందు భారీ వర్షాల కారణంగా వాటర్ లెవెల్స్ పెరగడంతో ఆరు గేట్లు ఎత్తారు అధికారులు. వరద ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు మూసేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎడతెరిపి లేని వానలు, వరదలతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి వరద ముప్పు పొంచి ఉండడంతో ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు వంతెన కూడా పురాతనమైంది కావడంతో వంతెన పైనుండి రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలోని భూపతిపాలెం రిజర్వాయర్కు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. స్పిల్వే గేట్ల ద్వారా 900 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో రంప కాజువే పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాజ్ వే పైనుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు.
ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం వద్ద కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటోద్దని అధికారులు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ జలాశయానికి కూడా వరద నీరు చేరుతోంది.
పల్నాడు జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 418 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెల్లంకొండలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు జిల్లాలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.
నల్లమల అటవీ ప్రాంతం సరికొత్త అందాలను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తుండడంతో దట్టమైన నల్లమలలో వాగులు, వంకలు జలసవ్వడులు చేస్తున్నాయి. కొండ సిగల నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఓ వైపు కొండలు, కోనలు, మరోవైపు పచ్చని చెట్ల మధ్య పాలనురగ్గలాంటి వాటర్ ఫాల్స్ చూపరులను ఆట్టుకుంటున్నాయి. సుమారు 100 నుంచి 200 అడుగుల ఎత్తయిన కొండల మీద నుంచి జలపాతాలు కిందకు దూకుతున్నాయి.
నంద్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకల కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ప్రైవేట్ స్కూల్స్కు సెలవు ప్రకటించారు యాజమాన్యాలు.
నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నెల్లూరు బురదగా మారిపోయింది. రోడ్లపై నీరు నిలబడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జనజీవనం అసౌకర్యానికి గురవుతున్నారు. జల్లులకే ఇలా ఉంటే పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తే సిటీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో పోలవరం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
భారీ వర్సాలకు నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. వరద ఉధృతి పెరగడంతో చెరువుకు గండి పడి దిగవనున్న పంటపొలాలు నీటమునిగాయి.
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకుగాను ప్రస్తుతం 642.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో ఏడు క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.