⦿ బీఆర్ఎస్తో నో కాంప్రమైజ్
⦿ పార్టీ ప్రెసిడెంట్గా చెప్తున్నా పొత్తుకు ఛాన్స్ లేదు
⦿ హైడ్రా అనేది కొత్తదేం కాదు
⦿ గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేతల చేపట్టేది
⦿ ఇప్పుడు హైడ్రాను తెరపైకి తెచ్చారు
⦿ నిర్వాసితులతో చర్చించాకే కూల్చివేతలు జరగాలి
⦿ మీడియాతో కిషన్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్, స్వేచ్ఛ: మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువగా జరిగాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. 40 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించిందన్నారు. ఇన్నాళ్లూ ఏం చేయకుండా, ఇప్పుడు సడెన్గా కూల్చడం సరికాదని చెప్పారు. ఆ ఏరియాల్లో ధనవంతులు ఎవరూ ఉండరని, సీఎం అక్కడి ప్రజలతో దర్బార్ పెట్టి ఒప్పించి కూలగొడితే బెటర్ అని సూచించారు.
వాల్తో నో వర్రీ
రిటైనింగ్ వాల్ కట్టి మూసీ సుందరీకరణ చేయొచ్చన్నారు కిషన్ రెడ్డి. డ్రైనేజీ వ్యవస్థ అంతా ముసీలోనే కలుస్తోందని, దానికి ప్రత్యామ్నాయం లేకుండా సుందరీకరణ అంటే సరిపోదని అభిప్రాయపడ్డారు. గంగా సుందరీకరణ కోసం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నామని, మూసీకి లక్ష 50వేల కోట్లు అంటే ఎక్కడి నుంచి తెస్తారని అడిగారు. అంత డబ్బు ఎందుకని ప్రశ్నించారు. హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగదన్నారు. దుందుడుకు నిర్ణయాలతో ప్రమాదమని హెచ్చరించారు. డీపఆర్ లేకుండా కూల్చివేస్తే ఎలా, బ్యాంక్ అప్పులు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. హైడ్రా కొత్తదేం కాదన్న కిషన్ రెడ్డి, గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేతలు కొనసాగించేందని గుర్తు చేశారు.
Also Read: ఎంఐఎంతో దోస్తీ కుదరని పని : మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్తో పొత్తు కుదరని పని
చాలాకాలంగా బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసిపోవడం వల్లే బీజేపీకి 8 సీట్లు వచ్చాయని అంటోంది. కొన్ని ఉదాహరణలను కూడా వివరిస్తోంది. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో పొత్తుల మీటింగులు జరిగాయని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ప్రెసిడెంగ్గా చెబుతున్నా, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేది లేదన్నారు. ఇటు జాతీయ రాజకీయాలపైనా స్పందిస్తూ, జమ్మూలో కొత్త వ్యక్తులకు టికెట్ ఇవ్వడం వల్లే మెజారిటీ తగ్గిందన్నారు. హర్యానాలో ఓట్ల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. జమ్మూ రీజియన్లో కాంగ్రెస్కు ఒక్క సీటు వచ్చిందని, కాశ్మీర్ లోయలో బీజేపీకి 90శాతం ఓటింగ్ పడిందని పేర్కొన్నారు. 29 సీట్లలో హిందువులు గెలిచారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక బీజేపీ అక్కడ ఇన్ని సీట్లు ఎప్పుడూ గెలవలేదని తెలిపారు.