Retired Engineers On KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నాటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కర్త, కర్మ, క్రియ అని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ను కేసీఆర్ సూచించారని.. తమ్మిడిహట్టి వద్ద ప్రపోజ్ చేసినా దాన్ని పక్కకు పడేశారని ఇంజనీర్లు వాపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై 2015లో వేసిన అనంతరాములు కమిటీలోని రిటైర్డ్ ఇంజనీర్లతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కీలకమైన సమాచారాన్ని అందించారు. అనంతరాములు కమిటీ రిపోర్టును పట్టించుకోలేదని అన్నారు. రిపోర్టును అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు కేసీఆర్కు అందించినా తాను సంతకం చేయకుండా ఓ మూలన పడేశారని వాపోయారు.
అనంతరం జస్టిస్ ఘోష్ స్పందించారు. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణకు రాకపోతే తనకు ఏం చేయాలో తెలుసన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమైన ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని సబ్ క్రాంటాక్ట్ వ్యవస్థపై ఆరా తీశారు.
కాంట్రాక్ట్ ఏజెన్సీల అకౌంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించే యోచనలో ఉన్నారు. వీటితో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి డేటా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ అకౌంట్ల లెక్కలు చూస్తే అసలు విషయం బయట పడుతుందని.. ఎంత మొత్తం చేతులు మారాయనేదానిపై స్పష్టత వస్తుందన్నారు.
Also Read: బాధ్యతల నుంచి తప్పుకోండి.. జస్టిస్ నరసింహారెడ్డి కమిటీకి కేసీఆర్ లేఖ
ఇప్పటివరకు 10 నుంచి 15 సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారని ఘోష్ నేతృత్వంలోని కమిషన్ వాటి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన కమిషన్.. అవి పరిశీలించాక అవసరమైతే సీడబ్ల్యూసీ వారిని పిలుస్తామన్నారు ఘోష్.
ఇక ఏఈఈ, డీఈఈలను విచారించాలా లేదా అనేదానిపై తర్వాత తెలుపుతామన్నారు. ప్రస్తుతానికి ఇంజనీర్లతో సమావేశం ముగిసిందని అఫిడవిట్లు వచ్చాకే తదుపరి విచారణ అంటూ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ స్పష్టం చేశారు.