Krishna River news today(Telugu news live): మస్త్ వాన పడుతోంది. ఫుల్ వరద పారుతోంది. ఇక వాటరే వాటర్. ప్రాజెక్టులన్నీ నిండాయని అనుకుంటున్నారంతా. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు. మంచి వర్షాలు పడుతున్నా.. వరద పారుతున్నా.. ప్రాజెక్టులు నిండుతున్నా.. ఇవన్నీ కేవలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రమే. గోదారి గలగల పారుతుంటే.. కృష్ణమ్మ మాత్రం వెలవెల పోతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు వరద కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.
ఓవైపు గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంటే.. మరోవైపు కృష్ణ బేసిన్ వెలవెలబోతుంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్.. ఏ ప్రాజెక్టు చూసినా ఇదే దుస్థితి. కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి డ్యామ్లు నిండకపోవడంతో దిగువకు వరద రావడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో.. జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తారు. ఇప్పుడు ఒక్క గేటు కూడా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు రైతులు.
దక్షిణ తెలంగాణకు జీవధార కృష్ణానదిలో నీటి ప్రవాహాలు క్రమేణ తగ్గిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నారిజర్వాయర్లలో నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. కృష్ణానది ఉపనదుల పరిస్థితి కూడా అంతగా ఆశాజనకంగా లేదు. భీమా, డిండీ, మూసీ, హాలియా, పాలేరు, మున్నేరు నదుల ప్రవాహం తగ్గడంతో వీటి ఆధారంగా ఉన్న జలాశయాల నీటినిల్వలు తగ్గిపోతున్నాయి.
కృష్ణా నది కర్ణాటక దాటిన తర్వాత తెలంగాణలోని మొదటి ప్రాజెక్టుగా జూరాల ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు నీటి సామర్ధ్యం తక్కువగా ఉంది. ఆ తర్వాత నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కీలకంగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుల్లో నీటినిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. వర్షాలు కురువకపోవడంతో పాటుగా వాతావరణంలోని వేడితో ఆవిరి నష్టాలతో ఈ ప్రాజెక్టులు తల్లడిల్లుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే ఆ ప్రవాహం ఆల్మటికి చేరుకుని.. ఆల్మట్టి నిండగానే ఆ నీరు కృష్ణా నదికి చేరి.. మహబూబ్ నగర్ జిల్లాలోని తంగిడి నుంచి తెలంగాణకి చేరుకుంటుంది. అక్కడినుంచి ప్రవహిస్తూ ప్రాజెక్టులను నింపుకుంటూ సాగే కృష్ణమ్మ ప్రవాహం వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉంటుంది.
ఆల్మట్టి 1705 ఫీట్ల ఏఫ్ఆర్ఎల్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1697.11 ఉంది. అలాగే ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం 129.72 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 106.10 గా ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే కానీ తెలంగాణలోకి వరదలు వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే కురిసే వర్షాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. గతంలో అంటే 2002, 2003, 2015, 2016లో కృష్ణ పరీవాహక ప్రాంతాల్లో ఇలాంటి కరువు పరిస్థితే నెలకొంది.
ఇప్పటివరకు ఎగువ కృష్ణానదిపై ఉన్న ఆలమట్టిలోకి చుక్కనీరు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఎప్పుడూ ఎదురుకాలేదు. ఈ ఏడాది ఎలా ఉంటుందన్నది ఆలమట్టిలోకి ప్రవాహం మొదలైతే కానీ చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు మరోసారి తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ఛాయలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే కృష్ణా నది ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. వరద నీటి పరుగులతో పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం, పోలవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ఇప్పటికే 43.9 అడుగులకు చేరుకుంది. పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. గోదావరి బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అటు కాళేశ్వరానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది.