Water Leakage from Annaram Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ అపర భగీరథుడుగా తనకు తానే ప్రకటించుకున్న మాజీ సీఎం కేసీఆర్ బండరాం మరోసారి బయటపడింది. ఇప్పటికే మేడిగడ్డ ఓ మేడిపండు అని తేలిపోగా.. ఇప్పుడు అదే లిస్ట్లో అన్నారం కూడా చేరిపోయింది. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్లో భారీ బుంగలు దర్శనమిస్తుండమే కాదు.. ఇప్పుడు మేడిగడ్డ తరహాలోనే పిల్లర్ల కింద నుంచి భారీగా నీరు లీకవుతోంది. దీంతో ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు వాళ్లే అన్నట్టుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల నోటి నుంచి ఇప్పుడు మాట రావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి వరకు జలజగడంపై సై అంటే సై అన్నట్టుగా వాదించిన గులాబీ నేతల నోళ్లను అసెంబ్లీ సాక్షిగా మూయించేశారు కాంగ్రెస్ నేతలు.
అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద కొత్తగా మరో బుంగ పడి.. కింద నుంచి భారీగా నీళ్లు లీక్ అవుతున్నాయి. వాటర్ లీకేజీలను అరికట్టలేక ఇంజినీర్లు చేతులెత్తేశారు. గతంలోనూ బుంగలు పడ్డాయి. ప్రస్తుతం పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయి వాటర్ లీకవుతున్నది. అసెంబ్లీలో వాటర్ లీక్ వీడియో ప్లే చేయగానే కారు పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు.
Read More : మేడిగడ్డపై విపక్షాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం.. హరీష్ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్లు
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆ అనుమానాలన్నీ నిజమని తేలిపోయింది. అసలు ఈ బ్యారేజీల పరిస్థితి ఏంటి అన్న దానిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. బ్యారేజీలకు ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతే కారణమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 18 వందల కోట్లతో టెండర్లను పిలిచి… అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతూ ఏకంగా 4 వేల 500 కోట్లకు తీసుకెళ్లారన్నారు. ఈ విషయాన్ని గమనిస్తే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో స్టోరేజీ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంజనీర్లు శుక్రవారం రాత్రికి రాత్రే గేట్లు తెరిచి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ముందుగా 2 గేట్లు తెరిచిన ఇంజినీర్లు.. నిన్న సాయంత్రానికి 10 గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు.
Read More : మేడారం జాతరలో హెలికాఫ్టర్ సేవలు.. జాయ్ రైడ్ కు ఎంతంటే..
అన్నారం బ్యారేజీని 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1,250 మీటర్ల పొడవునా 66 గేట్లతో నిర్మించారు. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ బ్యారేజీని మొదలుపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ నీటిని కన్నెపల్లి పంప్హౌస్ దగ్గర మోటార్లను స్టార్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీకి రివర్స్ పంపింగ్ చేస్తారు. అన్నారం బ్యారేజీ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సుందిళ్ల బ్యారేజీలోకి పంపిస్తారు. అయితే బ్యారేజీ స్టార్ట్ అయిన కొద్ది నెలలకే పిల్లర్ల కింద బుంగలు పడి లీకవడం స్టార్టయింది. కాంట్రాక్ట్ సంస్థ గ్రౌటింగ్ విధానం ద్వారా బుంగలు పూడ్చుకుంటూ వస్తుంది.
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన నాలుగు రోజుల తర్వాత అన్నారం బ్యారేజీలో కూడా పిల్లర్ల కింద ఇలా పది చోట్ల బుంగలు పడిన విషయం బయటికొచ్చింది. కెమికల్తో గ్రౌటింగ్ చేసి బుంగలను పూడ్చినట్లుగా ఇంజినీర్లు ప్రకటించారు. తీరా శుక్రవారం 34వ పిల్లర్ కింద నుంచి భారీగా వాటర్ లీకేజీ అవడం స్టార్టయింది. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 పరిధిలో 19,20,21 పిల్లర్ల వద్ద ఎలా అయితే భూ అంతర్భాగం నుంచి నీరు లీకవుతుందో.. అచ్చం అలాగే అన్నారంలోనూ వాటర్ లీకవుతుంది. లీకేజీ అరికట్టడానికి లోకల్ ఇంజినీర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కెమికల్ తో గ్రౌటింగ్ చేయడం వారికి సాధ్యమవ్వలేదు.
ప్రస్తుతం బ్యారేజీలో ఉన్న మొత్తం నీరు విడుదలవుతేనే.. అసలు బుంగలు ఎందుకు పడుతున్నాయి? పిల్లర్ల కింద ఉన్న ఇసుక పరిస్థితి ఏంటి? దానిని రిపేర్ చేసేందుకు అవకాశం ఉందా? ఉంటే ఎంత కాలం పడుతుంది? అన్న అంశాలపై పలు టెస్ట్లు నిర్వహించనున్నారు ఇంజనీర్లు. అప్పటి వరకు అటు మేడిగడ్డ, ఇటు అన్నారం బ్యారేజీలు రైతులకు నిరుపయోగం.. ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్ప.. వాటి వల్ల ఒరిగేదేం లేదని తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.