Telangana Assembly 2024 : తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీల్లో జల వివాదం ఒకటి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు భిన్నంగా ఉంటాయి. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడుతో అక్రమంగా ఆంధ్రా నీటిని తోడుకుంటోందని తెలంగాణ ముందునుంచీ వాదిస్తోంది. కానీ, అదనపు వాటాను తాము టచ్ చేయడం లేదని ఏపీ అంటోంది. ఈ వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపి వేయాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) లో పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల కృష్ణా జిలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే.. కృష్ణా జలాలను ఏపీ రాష్ట్రం దోచుకువెళుతుందని.. బురద కూడా మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉండటం వల్లే ఇంత దూరం వచ్చిందన్న ఆయన.. టెండర్ ప్రక్రియ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అందుకే, ఇప్పటికైనా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయాలనే డిమాండ్ ను తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Read more: మేడిగడ్డ బాటలోనే అన్నారం బ్యారేజీ.. పిల్లర్ల కింది నుంచి వాటర్ లీక్
వరదల సమయంలో నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి వరదలొచ్చినప్పుడు రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అలాగే, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా మరో 3 టీఎంసీల నీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకి 3 టీఎంసీల చొప్పున నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువనున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి తరలించాలనేది ప్రతిపాదన.
శ్రీశైలం ఎగువన లిఫ్ట్ చేసే నీటిని 4 కిలోమీటర్ల మేర తరలించి అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు-నగరి కాలువల ద్వారా తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణంపై ప్రారంభం నుంచి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ లిఫ్ట్ స్కీమ్ మూలంగా పర్యావరణ సమస్యలు వస్తాయంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రైబ్యునల్ లో పిటిషన్ వేయాలని నిర్ణయించింది.