Preethi: సంచలనం సృష్టించిన వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన గదిని పరిశీలించి సాక్షాలను సేకరించారు. ప్రీతి ఉపయోగించిన మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్లు తీసుకునే ముందు ప్రీతి మత్తుమందు మోతాదుపై గూగుల్లో సెర్చ్ చేసినట్లు గుర్తించారు.
అలాగే కొంతకాలంగా సైఫ్, ప్రీతిని వేధిస్తున్నట్లు ఆధారాలను సేకరించారు. వారిద్దరి వాట్సాప్ చాట్ను రిట్రీవ్ చేసి సైఫ్, ప్రీతిని అవమానించే రీతిలో చాటింగ్ చేసినట్లు గుర్తించారు.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిమ్స్లో వెంటిలేటర్పై ఉంచి ఎక్మో సపోర్టు ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
నిమ్స్కి వెళ్లి ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇది చాలా సున్నితమైన అంశమని.. అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులకు సూచించారు గవర్నర్ తమిళిసై.
మరో వైపు ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నిమ్స్ ముందు బీజేపీ, గిరిజన సంఘం నేతలు, భజరంగ్దళ్, బహుజన సమాజ్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
కాకతీయ వైద్యకళాశాలలో ప్రీతి అనస్థీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నారని ఇప్పటికే కళాశాల యాజమాన్యం దృష్టికి ఆమె తీసుకెళ్లింది. అయినా సరే వేధింపులు ఆగకపోవడంతో.. బుధవారం ఉదయం ప్రీతి హానికరమైన ఇంజక్షన్ చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు వరంగల్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం ఎంజీఎంకు తరలించారు. ప్రీతి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ప్రీతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో డాక్టర్ సైఫ్పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది.