Telangana Elections : తెలంగాణలో 70.74 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. 2018లో పోలింగ్ శాతం 73.37 గా నమోదైందని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని అన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91 శాతం ఓటింగ్ జరిగిందని తెలిపారు. యాకుత్ పుర లో అత్యల్పంగా 39 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ చెప్పారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని వికాస్ రాజ్ వెల్లడించారు.
తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 3 శాతం తగ్గిందన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 46.56 శాతం పోలింగ్ నమోదైందన్నారు. 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని వెల్లడించారు.
పోలింగ్ సమయంలో సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని పెట్టామన్నారు. 4,039 రూట్ ఆఫీసర్లు, 1,251 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు చేశామన్నారు. పోలైన ఓట్ల వివరాల పరిశీలన జరుగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే పోలింగ్ శాతంపై పూర్తి స్పష్టత వస్తుందని వివరించారు.
ఎన్నికల ఉల్లంఘనలపై 13 వేల కేసులు నమోదయ్యాయని వికాస్ రాజ్ వెల్లడించారు. 2018లో మాత్రం 2,400 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొందరు మంత్రులపైనా పోలీసులు కేసులు నమోదయ్యాయని వికాస్రాజ్ తెలిపారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందన్నారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్నారు. కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మొత్తం 49 కేంద్రాలలో ఈ లెక్కింపు జరగనుందని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నామన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. అక్కడ కౌంటింగ్ 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి టేబుల్పై మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారన్నారు.