బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై సబ్బండ వర్గాలు ఆగ్రహంగా ఉన్నారు. ముల్లోకాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవు. తానే పుట్టించానని కేసీఆర్ చెబుతున్నారు. అయితే జనం రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. పథకాలు పట్టించడం కాదు.. మా పుట్టి ముంచావు అని మండిపడుతున్నారు. నీ స్కామ్ల కోసం స్కీమ్లు రెడీ చేసి మమ్మల్ని రోడ్డున పడేశావని మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలను నమ్ముకున్న కేసీఆర్, కేటీఆర్.. ఓటర్లు అడ్డం తిరుగుతుండగా పునరాలోచనలో పడిపోతున్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ సారీ చెబుతున్నారు. కొన్ని పొరపాట్లు జరగడం సాధారణమే అని.. ఈసారి సరిచేసుకుంటామని చెబుతున్నారు. అయితే జనం కూడా సారీ.. రెండు సార్లు గెలిపించాం.. ఈసారికి సారీతో సరిపెట్టుకోవాలని బదులిస్తున్నారు.
తెలంగాణలో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్కు సంక్షేమ పథకాలు ముల్లులా గుచ్చుకుంటున్నాయి. ఉచిత స్కీమ్ల ప్రకటనలు పరేషాన్ చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని పథకాలు అని గొప్పలు చెప్పకుంటుండగా ముందు ఇక్కడ అమలయ్యాయా చెప్పండి సార్ అని నిలదీస్తున్నారు. రెండు విడతల్లోనూ అనేక హామీలు ఇవ్వగా అవన్నీ అటకెక్కాయి. దళిత బందు పథకం అంటూ ఎస్సీ వర్గాల్లో చిచ్చు పెట్టారు కేసీఆర్. ఆపద మొక్కులా హుజూరాబాద్ ఉపఎన్నికతో ఈ స్కీమ్ను సార్ తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత అటకెక్కించారు. ఈసారి గెలిస్తే ఒకే దఫాలో దళిత బంధు అమలు చేస్తానంటూ అలవిగాని హామీ ఇస్తున్నారు. ఇక రైతు బంధు అని చెబుతుండగా కౌలు రైతులను విస్మరించారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, యంత్రలక్ష్మి, రాయితీ విత్తనాలు, పంట నష్ట పరిహారం ఇలా ఏదీ అమలు చేయడం లేదు. బడ్జెట్ లేకపోవడంతో ఈసారి సమయం దాటిపోయినా రైతు బంధు సాయం కూడా అన్నదాతల ఖాతాల్లో వేయలేదు. పైగా దీన్ని కాంగ్రెస్ కుట్ర అని దుష్ప్రచారం చేసేందుకు ఎత్తుగడ వేయగా ఈసీ క్లారిటీతో అధికార పార్టీకి చెంపచెళ్లుమనేలా చేసింది.
ఎన్నికల్లో గట్టెక్కేందుకు తీసుకొచ్చిన బీసీ బంధు, మైనార్టీ బంధు మెడకు చుట్టుకునేలా చేశాయి. కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పథకాల నగదును దక్కించుకున్నారు. ఫలితంగా పథకాల వల్ల లద్ధికంటే డ్యామేజే ఎక్కువ జరిగింది. లబ్ధి కలగని లక్షలాది మంది బీఆర్ఎస్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక ధరణి పోర్టల్ పథకం దేశానికే ఆదర్శం అంటుండగా..అనేక లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రాష్టంలోని భూములు అమ్మకానికి పెట్టి.. పేదలకు గుంట భూమి పంపిణీ చేయడానికి మిగలకుండా చేశారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ అమలుకు నోచుకోలేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అని చెబుతున్నా వాస్తవం మరోలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణా అని గొప్పలు చెబుతుండగా మేడిగడ్డ కుంగుబాటుతో అసలు బండారం బయటపడింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి TSPSC పేపర్ లీకేజీలతో యువకులను రోడ్డున పడేశారు. గొల్లకుర్మలకు గొర్లు, మేకల పథకం మొదటిసారి అమలు చేసి రెండోసారి దరఖాస్తు పెట్టుకున్న వారికి సారీతో సరిపెట్టారు. చెరువుల్లో చేప పిల్లల పేరుతో భారీ స్కామ్లు చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అభాసుపాలైంది. రాష్ట్రంలో 28 లక్షల మంది గృహాలు లేని వారు అప్లై చేసుకుంటే అందులో పాయింట్ 5 శాతం మందికి కూడా దక్కలేదు. గృహలక్ష్మి పథకం కింద తొలుత ఐదు లక్షలు ఇస్తామన్నారు.. ఇప్పడు మూడు లక్షలకే పరిమితం చేశారు. గ్రామాల్లో రైతు వేదికలని ఊదరగొట్టగా అవి అలంకార ప్రాయంగా మారాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం లక్షల్లో దరఖాస్తులు పెట్టుకుని 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ చేసి బాధితులను రోడ్డున పడేశారు. పరిహారం దక్కక అవస్థలు పడుతున్నారు. ఫీజ్ రీఇంబర్స్ మెంట్ జరగక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు మాటలకే పరిమితం అయ్యాయి. ఇలా ఏ ఒక్క పథకం పరిశీలించినా మొత్తం ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కింది కూడా అధికార పక్షం నేతలు, కార్యకర్తలే కావడం ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. మొత్తానికి బీఆర్ఎస్ స్కీమ్లు కాస్తా ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. స్వయంగా కేటీఆరే దీన్ని అంగీకరించారు. రైతు బంధు పథకం వందలాది ఎకరాలకు దక్కడం వల్ల ఎకరం ఉన్న వాళ్ల ఆగ్రహానికి కారణమైందన్నారు. మరి ఇలా ఏ పథకం చూసినా ఏమున్నది గర్వకారణం అంతా డొల్లమయం అన్నట్లుగా గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టాయి.