Vivek : తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ కాషాయ జెండా పక్కనపెట్టి.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరగా.. ఇప్పుడు జి.వివేక్ వెంకటస్వామి కూడా ఆయన బాటలోనే పయనించారు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రిజైనింగ్ లెటర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన వివేక్ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన నోవాటెల్లో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లోకి వివేకా చేరిక మరింత బలాన్ని ఇస్తోందన్నారు.9 ఏళ్లపాలనలో కేసీఆర్ పాలనలో తన కుటుంబానికి తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు వెంకటస్వామి. కాంగ్రెస్లో చేరిన జి.వివేక్.. తన కుమారుడు వంశీకి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు.
మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు జి.వివేక్ వెంకటస్వామి.. నెక్స్ట్ ఎవరు? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. ఓ వర్గం నాయకులు బీజేపీ అధినాయకత్వం వైఖరిపై అసహనంతో ఉన్నారు. తమకు ప్రయారిటీ లేదన్నది ఒక వాదన కాగా.. బీఆర్ఎస్తో మిలాఖత్ అయ్యారనే అభిప్రాయం కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత దొరికిపోయినా చూసీ చూడకుండా వ్యవహరించి ప్రజల్లో పార్టీని చులకన అయ్యేలా చేశారని అంటున్నారు.