Telangana Politics News : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒకటి రెండు చోట్ల కాదు పలు చోట్ల జనాలు ఎదురు తిరుగుతున్నారు. ఓట్ల కోసం వెళుతుంటే ముఖం మీదే కొట్టినట్టు చెబుతున్నారు.
మా గొప్పగా చెప్పావు.. ఇంతకాలం చెప్పింది చాలుగానీ..
ఇక వెళ్లవయ్యా వెళ్లు.. అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కి తీరని అవమానం జరిగింది. మళ్లీ వచ్చావంటే చెప్పుతో కొడతామని ప్రజలు అనడం తీవ్ర దుమారాన్నే రేపింది.
ఎన్ని హామీలిచ్చావు.. అవేమీ చేయకుండా ఏం ముఖం పెట్టుకుని వచ్చావని నిలదీశారు.
సాక్షాత్తూ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పునరావాస బాధితులు మండిపడుతున్నారు. ఆ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయపడుతున్నారు.
కొన్నిచోట్ల అయితే ఎమ్మెల్యేలు బయటకి చెప్పుకోలేక, కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.
మేం బతికున్నామా? లేమా? అని చూట్టానికి వచ్చావా?
ఐదేళ్ల తర్వాత గుర్తొచ్చామా. అని కొన్నిచోట్ల ప్రశ్నిస్తున్నారు.
ఇలా వెళ్లిన ప్రతిచోటా బీఆర్ఎస్ అభ్యర్థులకి ఎదురవుతున్న మొదటి ప్రశ్న ఏమిటంటే..
డబుల్ బెడ్రూం ఇళ్లేవి?.. మనోడి దగ్గర నో ఆన్సర్
మరోచోట రుణమాఫీ రాలేదు.. దానికీ నో ఆన్సర్
సంక్షేమ పథకాలు అందడం లేదు.. దానికీ నో ఆన్సర్
పోనీ కేసీఆర్ చెప్పినవి పక్కన పెడితే ఎమ్మెల్యేగా మీరిచ్చిన హామీలేమయ్యాయి? అని ప్రశ్నిస్తే.. వాటికి నో ఆన్సర్
రోడ్లు, డ్రైనేజీలు? వీధిలైట్లు? మంచినీళ్లు? పారిశుధ్యం ఇలా ఒకటి కాదు ప్రతీదానికి ఎమ్మెల్యేల దగ్గర నో ఆన్సర్..
దీంతో వళ్లు మండిన ప్రజలు.. మరెందుకు వచ్చారు. ఓట్లు వేయించుకొని, ఐదేళ్లు ఎంజాయ్ చేయడానికా? అని గట్టిగానే కడిగేస్తున్నారు. కొన్నిచోట్ల తిరగబడుతున్నారు.
ఇంత వ్యతిరేకతను బీఆర్ఎస్ నేతలు ఊహించలేదు.
ఇన్నాళ్లూ పదిమందినేసుకుని దొరల్లా వచ్చి, ఫోజులు కొడుతూ, దండాలు పెడుతూ, చూద్దాం, చేద్దాం అని రెండు డైలాగులు కొడుతూ కాలం గడిపారు. ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఇలా ఎవరినీ లెక్కచేయకుండా వెళ్లడం వల్లే ఎమ్మెల్యేలను చూసేసరికి ప్రజలు శివాలెత్తిపోతున్నారు. మహిళలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకి ఉద్యోగాలన్నావ్.. ఏమయ్యాయి? వాళ్లకి వయసు మీరిపోతుంది? తల్లిదండ్రుల మీద ఎన్నాళ్లని ఆధారపడతారు? వాళ్లూ చెప్పుకోలేక నలిగిపోతున్నారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిచోట్ల ప్రాజెక్టుల పేరు చెప్పి భూములు లాక్కొని పునరావాస ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని రోడ్డున పడేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడికక్కడ సమస్యలు తిష్ట వేసుకుని ఉండటం వల్ల ఒకటి, మౌలిక వసతులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజల్లో అసంత్రప్తి పెరిగి, అదెంత దూరం వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కి ఈసారి ఎదురుగాలి తప్పలే లేదని అంటున్నారు.