BJP : సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టిక్కెట్ పై బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ టిక్కెట్ కోసం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు ప్రయత్నించారు. ఆయనకు బండి సంజయ్ మద్దతు కూడా ఉంది. అయితే టిక్కెట్ కేటాయించే విషయంలో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ కు షాక్ ఇచ్చింది.
వేములవాడ సీటును బీజేపీ అధిష్టానం.. మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమకు కేటాయించింది. ఈటల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఉమ కూడా కారు దిగి ఆయన వెంట బీజేపీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్ ఇప్పించేందుకు గట్టిగా ఈటల ప్రయత్నాలు చేశారు. వికాస్ రావు లాంటి బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న యువ లీడర్ నుంచి పోటీ ఎదురైనా.. చివరకు ఈటల పంతం నెగ్గించుకున్నారు. కాషాయ పార్టీ పెద్దలను ఒప్పించి తుల ఉమకు వేములవాడ టిక్కెట్ దక్కేలా చేయగలిగారు.
మరోవైపు వేములవాడ టిక్కెట్ తుల ఉమకు ఇవ్వడంతో బీజేపీలో ముసలం మొదలైంది. తుల ఉమకు వ్యతిరేకంగా బండి వర్గం ఏకమవుతోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే వారంతా హైదరాబాద్ కు వెళ్లారు. తుల ఉమ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆయన సన్నిహితుడు వికాస్ రావుకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై బీజేపీలో చర్చ నడుస్తోంది.
బండి మాట అధిష్టానం వద్ద చెల్లుబాటు కావడంలేదా? కాషాయ పెద్దలు ఈటలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? బీజేపీ ఇప్పటికే బీసీని సీఎంను చేస్తామని ప్రకటించింది. ఆ రేసులో పార్టీ నుంచి ఈటల, బండి ముందున్నారు. మరి తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ సీఎం అభ్యర్థి ఈటలేనా?