Gaddar: ఒకప్పుడు గద్దర్పైకి తుపాకీ ఎక్కుపెట్టారు పోలీసులు.. ఇప్పుడు గాల్లోకి తుపాకీ ఎక్కుపెట్టి గౌరవ వందనం సమర్పించారు.. గద్దర్ శరీరంలోని తుపాకీ తూటాల సాక్షిగా.. గాల్లోకి పేల్చి.. గన్ సెల్యూట్తో అనంత లోకాలకు సాగనంపారు..
జీవితమంతా రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు గద్దర్.. నక్సలైట్లలో చేరి పోలీసులతో యుద్ధమే చేశారు.. ఇప్పుడదే పోలీసులు గద్దర్ అంతిమ యాత్రలో బ్యాండ్ వాయిస్తూ ముందు నడిచారు..
జీవితమంటే ఇదే. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలీదు. గుమ్మడి విఠల్ రావు జీవితంలో అదే జరిగింది. తొలినాళ్లలో పాటతో ప్రజల్లో విప్లవ బీజాలు నాటారు. సినిమాల్లోనూ నటించారు. అడవులకి వెళ్లి.. తుపాకీ పట్టి.. అన్నల్లో కలిశారు. ఆయన ఉండాల్సింది జంగల్లో కాదంటూ.. మళ్లీ జనాల్లోకి వదిలారు. పాటతో, ఆటతో, బుర్రకథతో.. ఉద్యమ జ్యోతి ఆరకుండా రగిలించ్చారు.
ఏ తుపాకీ రాజ్యం కోసమైతే పోరాడారో.. అదే తుపాకులు వదిలేస్తూ.. ప్రభుత్వంతో శాంతిచర్చల కోసం మావోయిస్టు పార్టీ తరఫున దూతగా వెళ్లిన ఘనత కూడా గద్దర్దే. 2002లో వరవరరావుతో కలిసి సర్కారుతో చర్చలు జరిపడం ఆసక్తికరం.
భుజాన నల్ల గొంగలి వేసుకుని.. చేతిలో ఎర్ర జెండాతో దశాబ్దాల పాలు విప్లవ పథంలోనే ప్రయాణించిన గద్దర్.. హఠాత్తుగా ప్రజాస్వామ్యవాదిగా మారడం అనూహ్యమనే చెప్పాలి. ఏ బూర్జువా పాలనపై ఏళ్ల తరబడి పోరాడారో.. ఏ ప్రజాస్వామ్యవాదంపై పాటతో తుపాకీ ఎక్కుపెట్టారో.. అదే రాజకీయ పథంలో పయనించి.. అందరికీ ప్రశ్నగా మారారు. మావోయిస్టు పార్టీ నుంచి వైదొలిగారు.
ఒకప్పుడు బ్యాలెట్ కంటే బుల్లెట్ పవర్ఫుల్ అనుకున్నారు. చివరిదశలో బుల్లెట్ కంటే బ్యాలెటే గొప్పని గుర్తించారు. పలు పార్టీలతో పథం కథం కదిపారు. వేదికలు పంచుకున్నారు. నేతలతో చేతులు కలిపారు. రాజకీయ ప్రసంగాలూ చేశారు. ఈసారి ఏకంగా సొంతపార్టీతో సత్తా చాటుదామని అనుకుంటుండగానే.. ఇలా హఠాత్తుగా మృత్యువు కబళించింది. గద్దర్ పొలిటికల్ ప్రస్థానం అర్థాంతరంగా ముగిసింది.
ఒకే వ్యక్తి అనేక వర్గాలను ఆకట్టుకోవడం అంత సులువు కాదు. గద్దర్ కడసారి చూపుల కోసం అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ఉద్యమకారులు, కళాకారులు, ప్రజాసంఘాలు, బడుగు, బలహీన, అగ్రవర్ణాలు.. ఇలా అనేకమంది తరలివచ్చారు. అశ్రునివాళులు అర్పించారు. అంతా గద్దర్ను తమవాడిని చేసుకుంటున్నారు. ఇలా విభిన్న ధృవాల, వర్గాల ఆదరణ చూరగొనడం గద్దర్కే సాధ్యమైంది.
దేవుడే లేడన్నారు. హిందూయిజంపై విమర్శలు చేశారు. బుద్ధిజమే గొప్పని ఆచరించారు. అదే గద్దర్.. తదనంతర కాలంలో ఆలయాలకు వెళ్లారు. దేవుళ్లను దర్శించారు. రామానుజులపై పాటలు పాడారు. ఎంతటి వేరియేషన్. నాస్తికుడు ఆస్తికుడిగా మారిన మేకోవర్.
సిద్ధాంతాలు మార్చుకున్నా.. మూల సూత్రం మాత్రం మారలేదు. జీవితాంతం పీడిత తాడిత పక్షానే నిలిచారు గద్దర్. వారి కోసమే గజ్జె కట్టారు. ఆ వర్గాల కోసమే గొంతెత్తి పాట పాడారు. ఇప్పుడు ఆ గొంతు మూగబోయినా.. ప్రజా గొంతుకలో.. ప్రశ్నించే పాటలో.. చిరస్థాయిగా జీవించే ఉంటారు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్.