Varahi: జనసేన అధినేత పవన్కల్యాణ్ కరీంనగర్ జిల్లా కొండగట్టుకు రానున్నారు. తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. అంజన్న ఆశీర్వాదం తీసుకోనున్నారు. కొండగట్టు ఆలయాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఏపీలో తన రాజకీయ ప్రస్థానానికి కీలక దశకు చేర్చే వారాహి వాహనం గేరు మార్చే శుభసమయం ఆసన్నమైంది.
బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఉదయం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వస్తారు. వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం అక్కడ నుంచి నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ కు వెళ్లి.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ అనుసరించే వ్యూహాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలోనూ బరిలో జనసేన నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేయగా.. నాచుపల్లిలో జరిగే సమావేశంలో ఆ దిశగా కీలక అడుగులు పడే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనుష్టుప్ నారసింహ యాత్ర ధర్మపురి నుంచే ప్రారంభిస్తారు. మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను వరుసగా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.
ఇక, కొండగట్టుతో పవన్ సెంటిమెంట్ ఈనాటిది కాదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు… తమ ఇలవేల్పు అయిన ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో యువరాజ్యం విభాగానికి పవన్కల్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. స్వామి దర్శనం అనంతరం.. ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేస్తున్న సమయంలో… 11కేవీ విద్యుత్ తీగలు తగిలి.. పవన్కల్యాణ్ కిందపడిపోయారు. స్పృహ కోల్పోయిన పవన్.. అరగంట తర్వాత లేచి మళ్లీ ప్రచారంలో పాల్గొన్నారు. తనకు అంతటి పవర్ ఫుల్ కరెంట్ షాక్ కొట్టినా కూడా.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సుల వల్లే తాను అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. అప్పటినుంచి కొండగట్టు.. పవన్ కు సెంటిమెంటుగా మారింది.