Uttam Kumar reddy : కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్ల పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే పని చేశాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ప్రశ్నించడం ఏంటని కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి కిషన్రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్ మార్చారన్నారు. స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. బ్యాంక్ లు, రూరల్ ఎలక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించిందని ఉత్తమ్ తెలిపారు.
పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్కు నిబంధనలు మార్చేసి మరీ లోన్ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు మంజూరు చేశారన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల లోన్ బీజేపీ ఇప్పించిందన్నారు. ఇద్దరం కలిసి ‘‘దోచుకుందాం’’ అని లక్షల కోట్లు ఇచ్చారా? అని కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విజిట్ చెయ్యలేదని కిషన్ రెడ్డిని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించక పోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందన్నారు. సీబీఐ-ఈడీ అంటూ ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదని ఉత్తమ్ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా పదే పదే అన్నారు కదా.. మరి ఎందుకు విచారణకు అదేశించలేదని ప్రశ్నించారు.
లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలను ఉత్తమ్ ప్రశ్నించారు. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారని బీజేపీ ఆరోపణ చేసిందన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుందన్నారు. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెట్టామని మంత్రి తెలిపారు. పదేళ్ల పాటు అవినీతి కోసం బీజేపీ-బీఆర్ఎస్లు కలిసి పని చేశాయన్నారు. బాధ్యతలు తీసుకుని 20 రోజులైనా గడవక ముందే మాపై విమర్శలా?. కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎవరు తప్పు చేసినా మేం వదిలిపెట్టమని మంత్రి ఉత్తమ్ చెప్పారు.