వరంగల్, స్వేచ్ఛ: మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి దేశంలోని ఆలయాల రూపురేఖలు మారుస్తున్నట్టు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. మంత్రి అయిన తర్వాత వెంటనే జమ్ము కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు రావడంతో అక్కడ బిజీబిజీగా గడిపారు కిషన్ రెడ్డి. ఈమధ్యే అక్కడ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో వరంగల్ వచ్చి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేశారు.
Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని 92 నియోజకవర్గాల్లో..
దేశంలో చాలా దేవాలయాలను అభివృద్ధి చేశామని, తెలంగాణలో జోగులాంబ, భద్రాచలం, రామప్ప, బల్కంపేట అమ్మవారి దేవాలయాలను అభివృద్ధి చేశామని వివరించారు. అయోధ్య, వారణాసి ఆలయాలతోపాటు పంచ దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా 150 దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి పండుగలలో యువత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారని, అన్ని రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగిందని చెప్పారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే పెద్దలపట్ల గౌరవం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో జాతీయ జెండాను నిలిపే వరకు కృషి చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.