డైవర్షన్ డ్రామా!
– మొన్నటిదాకా హైడ్రా గొడవ
– ఇప్పుడేమో విగ్రహాల లొల్లి
– గ్యారెంటీలపై చర్చ లేకుండా డైవర్షన్ డ్రామా
– బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే
– వీరుల బలిదానాలు, త్యాగాలు మరిచాయి
– సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినోత్సవమే
– అలా జరిగినప్పుడే హాజరవుతామన్న బండి
Bandi Sanjay: సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమేనని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కరీంనగర్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన, అనంతరం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. హిందూవుల పండుగులకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. సెప్టెంబరు 17 నరేంద్ర మోదీ పుట్టినరోజు, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని చెప్పారు. రజాకార్ల అరాచకాలను మనం ఎప్పుడూ మరిచిపోలేమన్నారు.
బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసిందని, కానీ, అధికారంలో ఉన్నన్నాళ్లూ జరపలేదని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా విమోచన దినోత్సవం జరుపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ భయపడి సెప్టెంబరు 17ని జరుపడం లేదన్నారు. వీరుల బలిదానాలను, త్యాగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచిపోయాయని ఆరోపించారు. ఎంఐఐ పార్టీ, ఎవరు అధికారంలో ఉంటే వారి చంకలో ఉంటుందని విమర్శించారు. తామంతా సర్దార్ పటేల్ వారసులమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆగస్ట్ 15 లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామన్నారు సంజయ్.
Also Read: Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!
మొన్నటిదాకా హైడ్రా లొల్లి, ఇప్పుడు విగ్రహాల లొల్లి షురూ చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలపై దృష్టి మరల్చడానికే ఏదో ఒక లొల్లిని తెరపైకి తెస్తున్నారని, దమ్ముంటే ఆరు గ్యారెంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు బీఆర్ఎస్ చేతిలో ఉంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ చేతిలో ఉందన్నారు. సెప్టెంబర్ 17న ప్రజా పరిపాలనా దినోత్సవం అంటే ఒప్పుకోమన్న బండి, ఇది ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమేనని, అలా అనడానికి భయమెందుకని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే బీజేపీ తరఫున హాజరవుతామని స్పష్టం చేశారు. తమకు విగ్రహాల లొల్లి వద్దు, ఆరు గ్యారెంటీల అమలు కావాలని సెటైర్లు వేశారు బండి సంజయ్.