Unemployed Dharna against government to Postpone Schedule: తెలంగాణలో నిరుద్యోగుల పోరు సెగలు, నిరసన స్వరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక పక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని స్వయంగా సీఎం చెబుతున్నా నిరుద్యోగుల ఆందోళనలతో నగర ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది.షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 లేదా 2 పరీక్షల సమయం ఒకటే కావడంతో రెండింటికీ అప్లై చేసినవారు ఒకదానిని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి పరీక్షల షెడ్యూల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయబోమని అలాగే డీఎస్సీ పరీక్ష కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఖరాఖండిగా తేల్చిచెప్పేశారు. దీనితో నిరుద్యోగులంతా ఆదివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ పరిసర ప్రాంతాలలోపెద్ద సంఖ్యలో ధర్నాలకు దిగారు. అలాగే గ్రూప్స్ కు సంబంధించిన కొలువులు మరిన్ని పెంచాలని తీవ్రస్థాయిలో ఉద్యమించారు.
నిరుద్యోగులు, పోలీసుల వాగ్వాదం
ఆదివారం నిరుద్యోగుల ధర్నాలతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ముందుకు కదలక వాహనదారులు ఇబ్బందులపాలయ్యారు. అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిరుద్యోగులను చెదరగొట్టే క్రమంలో నిరుద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ఈ ఘర్షణల మధ్య ఓ నిరుద్యోగి కళ్లుతిరిగి పడిపోయాడు. వెంటనే పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. ముందుగా తెలిస్తే వేరే రూట్ లో వెళ్లేవారమని పోలీసులు అటునుంచి అటే వాహనాలను తరలిస్తే బాగుండేదని అన్నారు.
అన్ని పరీక్షలు ఒకే సమయంలోనా..?
ఓ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేక చాలా నష్టపోయామని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరతాయని ఆశించామని అన్నారు. వరుసగా ఎన్నికలు రావడంతో ఆలస్యమయిందని ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకీ పూనుకోవడం అభినందనీయం అన్నాడు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం నిరుద్యోగులకు నష్టం కలిగే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ ఒకేసారి గ్రూప్ 1, 2 నిర్వహిస్తే నష్టపోయేది నిరుద్యోగులే అన్నాడు. ఇంతకాలం ఎదురుచూసి ఏజ్ బార్ అవుతున్న అనేకమంది నిరుగ్యోగులు పరీక్షలు వాయిదా వేయకపోవడం వలన నష్టపోతున్నారని రెండింటికీ అప్లై చేయడం వలన ఏదో ఒకదానికి మాత్రమే ప్రిపేర్ కావలసి వస్తోందని అంటున్నాడు.
Also Read: Raithu Runamafi: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
మెగా డీఎస్సీని ప్రకటించాలి..
డీఎస్సీ పరీక కు ప్రిపేర్ అవుతున్న మరో నిరుద్యోగ యువకుడు తాను గ్రూప్స్, డీఎస్సీ కి కూడా అప్లై చేశానని దీని వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కనీసం డీఎస్సీ పరీక్షను డిసెంబర్ వరకూ ఆగి మరికొన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ కింద 25 వేల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాడు. తమ వెనుక ఏ రాజకీయ శక్తులు లేవని..తమకి తామే స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం ఇది. ఇకనైనా రేవంత్ సర్కార్ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటే వేలాది నిరుద్యోగులకు మేలు చేకూరుతుందని మరో నిరుద్యోగి అన్నాడు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన పోలీసులు పెద్దసంఖ్యలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.