Road Accident : రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి యువకులను వేగంగా వస్తున్న కారుడీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమలో విధులు ముగిసిన తర్వాత 44 వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది.
ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు 25 నుండి 30 సంవత్సరాల వయసులోపు వారే ఉన్నారని సమాచారం. మృతుల్లో ఒకరిని షావాజ్(28) గా గుర్తించారు. మరొ యువకుడిని గుర్తించాల్సి ఉంది. చేగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.