Apsara Murder Case : హైదరాబాద్ శివారు శంషాబాద్లో హత్యకు గురైన అప్సర కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహమైందని ఇప్పటికే బయటపడింది. ఇప్పుడు ఆమె మాజీ అత్త ధనలక్ష్మి సంచలన విషయాలు బయటపెట్టారు. అప్సర హత్యకు ఆమె తల్లి డబ్బు ఆశే కారణమని ఆరోపించారు. అంతేకాదు అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపుల వల్లే తన కొడుకు కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
తన కూతురిని హీరోయిన్ చేసి తద్వారా డబ్బు సంపాదించాలన్నది అరుణ ప్లాన్ అని ధనలక్ష్మి ఆరోపించారు. అప్సర హత్యకు గురైన విషయం తనకు టీవీ చానళ్లలో వచ్చిన వార్తల ద్వారా తెలిసిందన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన తన కుమారుడు కార్తీక్ రాజా మూడేళ్ల క్రితం అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. తన కొడుకుకు అప్సర తల్లి అరుణ నరకం చూపించిందని ఆమె ఆరోపించారు.
కార్తీక్ రాజాతో అప్సర ఆమె తల్లి అరుణ కలిసి ఉండేవారని ధనలక్ష్మి వెల్లడించారు. తన కొడుకుతో అప్సర మాటమాటకి గొడవ పెట్టుకునేదని వివరించారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని తాను అప్సరను నిలదీసే ప్రయత్నం చేశానన్నారు. మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె టాబ్లెట్స్ వాడుతుందని తన కొడుకు చెప్పాడని ధనలక్ష్మి వెల్లడించారు. తాను కోరింది ఇవ్వలేకపోయినా… తాను చెప్పినట్టు చేయకపోయినా… అరవడం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, కత్తితో చేతులు కోసుకోవడం చేసి సైకోలా ప్రవర్తించేదని ఆమె తెలిపారు.
విలాసవంత జీవితాన్ని కోరుకున్న అరుణ విమానాల్లో తిప్పాలని… స్టార్ హోటల్స్లో విందులు కోసం కార్తీక్ రాజాపై అప్సరతో ఒత్తిడి చేయించేదని ధనలక్ష్మి ఆరోపించారు. గొంతెమ్మ కోరికలు తన బిడ్డ తీర్చకపోవటంతో అప్సర ద్వారా కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆరోపించారు. ఈ అవమానం భరించలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కనీసం చివరి చూపు చూసేందుకు అప్సరగాని.. ఆమె తల్లి గాని అంత్యక్రియలకు హాజరు కాలేదని అప్పర మాజీ అత్త ధనలక్ష్మి ఆరోపించారు.
తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నప్పటికే అప్సర గర్భవతి అని ధనలక్ష్మీ వెల్లడించారు. అయితే అప్సర అబార్షన్ చేయించుకుందని తెలిపారు. తల్లి డబ్బు ఆశకే అప్సర కూడా బలైపోయిందని ధనలక్ష్మి ఆరోపించారు.