నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. 9 రోజుల వ్యవధిలోనే నిందితుడు ఆరుగురిని హతమార్చాడు. అయితే.. వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్కు మాక్లుర్లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు.
ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం.
నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రశాంత్ ప్రమేయాన్ని పోలీసులు అనుమానించారు. విచారణలో ఆరుగురిని హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ప్రసాద్ తల్లి సుశీల కూడా కనిపించడం లేదని బంధువులు అంటున్నారు. సుశీలను కూడా ప్రశాంత్ చంపేశాడా ? లేక ఎక్కడైనా దాచి పెట్టాడా ? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీరియల్ కిల్లర్ ప్రశాంత్ చంపింది ఆరుగురినా లేక ఏడుగురినా ? అని సందేహాలొస్తున్నాయి. మొత్తం ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. ఇప్పుడు సుశీల కూడా కనిపించకపోవడంతో.. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.