Thummala : ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఉదయమే తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు.
తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో తిరుగులేని నేత. ఆయనకంటూ సొంత అనుచరగణం ఉంది. మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల నాయకుడు. 1985,1994,1999, 2009 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఏపీకి మంత్రిగా పనిచేసిన ఆయన.. 2014లో సీఎం కేసీఆర్ పిలుపుతో BRSలో చేరారు. ఆ తర్వాత తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
ఇక 2016లో జరిగిన పాలేరు బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై తుమ్మల భారీ విజయం సాధించారు. తుమ్మల 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఉపేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి తుమ్మల అసహనంతో ఉన్నారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని ఆయన భావించారు. కానీ సీఎం కేసీఆర్ తుమ్మలకు నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే ప్రకటించారు.
పాలేరు టిక్కెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం తుమ్మల హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లగా, ఆయన అభిమానులు జిల్లా సరిహద్దులోని నాయకన్గూడెం దగ్గర గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మల పార్టీ మారాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరులు పట్టుబట్టారు. గోదావరి జలాలతో ఖమ్మం ప్రజల కాళ్లు కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానన్నారు తుమ్మల. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. అనుచరుల ఒత్తిడితో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.