Tummala-KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ ఒకరిమీద ఒకరు ప్రచార సభల్లో ఛలోక్తుల బాణాలు సంధిస్తున్నారు
Tummala-KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ ఒకరిమీద ఒకరు ప్రచార సభల్లో ఛలోక్తుల బాణాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల టికెట్ ఇవ్వకపోవడంతో సీనియర్ పొలిటషీయన్ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
తుమ్మల ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ తుమ్మలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా వెనక్కు తగ్గడం లేదు. ఆయన కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతివిమర్శలు చేస్తునారు. అయితే ఈ మాటల యుద్దంలో ఒకరినొకరు దూషించుకుంటున్నారు.
మొదటిసారి ఒక ప్రచార సభలో కేసీఆర్ మట్లాడుతూ.. “తుమ్మలకు నేను మోసం చేశానంటా.. ఆయన ఎన్నికలలో ఓడిపోయి మూలన కూర్చొని ఉంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చాను. ఆయన మాత్రం పార్టీ కోసం ఏమీ చేయలేదు”, అని అన్నారు. దానికి సమాధానంగా తుమ్మల సమాధానమిస్తూ.. “కేసీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే అప్పుడు టీఆర్ఎస్లో చేరాను. కానీ కేసీఆర్ మోసకారి, స్వార్థపూరిత వైఖరి నచ్చక కాంగ్రెస్లో చేరాను”, అని చెప్పారు.
తాజాగా సీఎం కేసీఆర్ మరో ప్రచార సభలో తుమ్మలపై సెటైర్లు వేశారు.బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో మాట్లాడుతూ.. “పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మలు తుప్పలు కావాలా?.. తుమ్మలు.. తుప్పులను నమ్మకండి. తుమ్మకు ముళ్లుంటయి.. వాటి వల్ల ప్రయోజనం లేదు. పువ్వాడ పువ్వులాంటోడు. మంచి సువాసన వస్తది. ఆయనను నమ్మండి. ఉపయోగం ఉంటుంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు” అని వ్యంగ్యంగా అన్నారు.
దీనికి తుమ్మల కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ కూడా తనతో పాటు టీడీపీలో ఉన్నారని ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. కేసీఆర్కు మొదట చంద్రబాబు అటవీ శాఖ ఇచ్చారని కేసీఆర్ కు ఆ శాఖ నచ్చకపోతే బాబుతో మాట్లాడి రవాణా శాఖ ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ అంగీకరించరు కాబట్టి చంద్రబాబును అడిగితే నిజానిజాలు తెలుస్తాయని తుమ్మల అన్నారు.
శివలింగం మీద తేలు లాంటి వాడు కేసీఆర్, తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతోనే ఆ తేలును కొట్టాలని తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్పై సెటైర్లు వేశారు.
కేసీఆర్తోపాటు పువ్వా అజయ్ కుమార్ కూడా ప్రచర కార్యక్రమంలో తుమ్మలని టార్గెట్ చేశారు. గతంలో టీడీపీ, తర్వాత బీఆర్ ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల్లోకి తుమ్మల వచ్చారని అన్నారు. పూటకో పార్టీ.. గంటకో కండువా! అంటూ. పువ్వాడ కూడా సెటైర్లు వేశారు. ప్రతి ఎన్నికలకు ఒక్కొక్క పార్టీ మారుతున్నారంటూ.. తుమ్మలపై విమర్శలు గుప్పించారు.
దీనిపై తుమ్మల తీవ్రంగా స్పందించారు. “ఔను.. పువ్వాడ పువ్వే. కానీ, పూజకు పనికిరాని వయ్యారి భామ పువ్వు. తుమ్మ చెట్లకు ముళ్లున్నా.. దానిని నాగలి చేసుకుని దున్నుకుంటే రైతన్నకు బతుకు ఇస్తుంది. పంటలు పండేలా చేస్తుంది” అని అన్నారు.
పువ్వాడ పువ్వేమీ కాదని.. ఆయన కూడా జంపింగ్ జిలానీనేనని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం సీపీఐలో ఉన్న పువ్వాడ కుటుంబం.. ఆ తరువాత ఆ పార్టీకి తూట్లు పొడిచి.. వైసీపీలో చేరారని.. ఇది నీతా? అని తుమ్మల తనదైన శైలిలో ప్రశ్నించారు.
తాను చచ్చేంత వరకు జగన్తోనే ఉంటానని.. ఆ తర్వాత.. వైసీపీని కూడా వదిలేసి కాంగ్రెస్ పంచన చేరారని.. ఇప్పుడు బీఆర్ ఎస్లో ఉండి.. నాకు నీతులు చెబుతున్నారని తుమ్మల వ్యాఖ్యానించారు. వారు చేస్తే సంసారం పక్కవారు పార్టీ మారితే వ్యభిచారమా ? అని నిలదీశారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ పరిణామాలను గుర్తించే తాను పార్టీ మారానన్నారు. రాష్ట్ర విభజన జరిగాక తాను తెలుగుదేశంలో ఉంటే.. తనను కేసీఆర్ బతిమిలాడి పార్టీలో చేర్చుకున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు.
తనను వాడుకున్న కేసీఆర్ తర్వాత.. అవమానించారని, అందుకే కాంగ్రెస్లోకి వచ్చానని.. ఇది కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు ప్రజల కోసమేనని తుమ్మల చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒకేసారి అటు కేసీఆర్, ఇటు పువ్వాడలపై తుమ్మల విసిరిన కౌంటర్ బాణాలు చాలా పదునుగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఉండబోతోందని అర్థమవుతోంది.