Kasani Gnaneshwar : టీటీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి, తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తెలంగాణలో పోటీ చెయొద్దని పార్టీ అధిస్టానం చెప్పగా, కార్యకర్తలు చేయాలంటున్నారని తెలిపారు. ఈ విషయంపై లోకేష్కు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడంలేదని.. అందుకే రాజీనామా చేశానన్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ కానున్నట్లు తెలుస్తోంది.
తాను రాకముందే తెలంగాణ టీడీపీ బలంగా లేదని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.కార్యకర్తలు మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడం సరైన పని కాదన్నారు. చిన్నచిన్న పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెడుతున్నాయని కాసాని పేర్కొన్నారు.
లోకేష్ దగ్గరకు వెళ్తే కనీసం మాట్లాడలేదని కాసాని జ్ఞానేశ్వర్ వాపోయారు. కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని ఓ వర్గం వాదన తెచ్చారని, ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో కొనసాగదలుచుకోలేదన్నారు కాసాని జ్ఞానేశ్వర్. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసి ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. ఇంకెందుకు పార్టీలో ఉండటం అని అసహనం చెందారు. గెలిచినా, ఓడినా ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. కొంతమంది టీడీపీ నేతలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదన తెచ్చారన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తమ మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పిన నేపథ్యంలో.. బహుశా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.