Metro Type Setting In Hyderabad City Buses: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలో గతంలో రోజూ 11 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు రెండింతలైంది. 18-20 లక్షల మంది రోజు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఆసమయంలో ఉద్యోగుల, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సోమ, బుధవారం మరింత రద్దీ ఉంటోందని గణాంకలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం ఉండటంలేదు.
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లోని కొన్ని సీట్లు తొలగించాలని భావిస్తోంది. దీంతో మరింత మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని యోచిస్తోంది. బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అప్పుడు నిలబడి కూడా ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని రూట్స్లో బస్సుల సీటింగ్ మార్చింది.
Read More: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని దారుణం.. ఎల్బీ నగర్లో యువకుడి హత్య..
సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చేది. మహాలక్ష్మి అమలు తర్వాత మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కండక్టర్ టికెట్లు జారీ చేయడం కూడా కష్టంగా ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమేనని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
ఆరు సీట్లు తొలగిస్తే.. బస్సుకు ఇరువైపులా మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇలా 10 సీట్లు ఏర్పాటు చేస్తే గతంతో పోలిస్తే రెండు సీట్లు తగ్గుతాయన్నారు. రద్దీ ఎక్కువున్న మార్గాల్లో కొన్ని బస్సులకు సీటింగ్ వ్యవస్థ మార్చామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు.