తెలంగాణ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు అక్కడ నిరసన చేస్తున్నారు. గవర్నర్ తమిళిసైకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు తొలుత ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. ఆ తర్వాత రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లారు. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల నిరసన నేపథ్యంలో రాజ్భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు ఆహ్వానించారు. వివిధ యూనియన్లకు చెందిన 10 మంది నేతలను రాజ్ భవన్ లోకి అనుమతించారు.
ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడించడం బాధించిందని తమిళి సై అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకిని కాదంటూ ట్వీట్ చేశారు. గతంలో సమ్మె సమయంలోనూ కార్మికులకు అండగా ఉన్నానని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ప్రయత్నిస్తున్నానని స్పష్టంచేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ప్రస్తుత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇది ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ కు పంపింది. రెండు రోజులైనా గవర్నర్ ఆ బిల్లుకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు విధులకు హాజరుకాలేదు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లోనే బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. చాలా చోట్ల ఆర్టీసీ సర్వీసులు నడవడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం సమయంలో విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. హైదరాబాద్లో హయత్నగర్, షాద్నగర్, ఫలక్నుమా, ఫరూక్ నగర్, హకీంపేట, లింగపల్లి హెచ్సీయూ, కూకట్పల్లి , ఉప్పల్, చెంగిచర్ల డిపోల్లో కార్మికులు నిరసన చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.