TSRTC: మహాలక్ష్మి పథకంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చూసినా.. ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. ఉన్న బస్సులు రద్దీగా ఉండటంతో.. ఇటీవలే 80 కొత్త బస్సుల్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కొత్తబస్సుల్ని ప్రారంభించారని సంతోషించే లోగా.. టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఊహించని షాకిచ్చింది.
కొత్తసంవత్సరం ప్రారంభం నుంచి.. అంటే జనవరి 1వ తేదీ నుంచి ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల రద్దీ కారణంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ రెండు టికెట్లను ప్రయాణికులకు జారీ చేయాలంటే.. కండర్లు వారి గుర్తింపు కార్డులను చూసి.. వయసు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు టికెట్లు జారీ చేసేందుకే కండర్లకు ఎక్కువ సమయం పడుతోంది. అలాగే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దన్న ఉద్దేశ్యంతోనే ఫ్యామిలీ 24, టి6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
.
.