TSRTC Record in One Day(Telangana news today): టీఎస్ఆర్టీసీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క సోమవారం రోజే బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. సంస్థ హిస్టరీలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. రెండు నెలల క్రితం రేవంత్ సర్కార్ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఈ పథకం ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎక్కువగా హైదరాబాద్తో పాటు వేములవాడ, కాళేశ్వరం సహా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా ఈ అద్భుత అవకాశాన్ని మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారు.
Read More : నేటి నుంచి మేడారం జాతర ప్రత్యేక పూజలు.. మండమెలిగే పండుగ పేరుతో ఉత్సవం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఒకటి. ఈ హామీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఎండీతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. మహాలక్ష్మి పథకం అమలుతో.. 60 శాతం మంది మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ వద్ద అద్దె వాటితో కలిపి మొత్తం 9,100 బస్సులున్నాయి. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షలకు చేరింది. మహాలక్ష్మి పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా 150 బస్సులు సమకూరాయి. ఇంకా 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. దీంతో కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నపళంగా రిక్రూట్ చేసుకోవాలని ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వం దశల వారీగా కొత్త బస్సుల్ని ప్రవేశపెడుతోంది. వీలైనంత త్వరగా ఎక్కువ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.