TSRTC News : తెలంగాణలో ఆర్టీసీ బస్సు బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇటీవల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ ముందుకు కదలడంలేదు. బిల్లు ఆమోదానికి రాజ్భవన్ ఓకే చెప్పినప్పటికీ.. పాస్ అయిన బిల్లుపై గవర్నర్ ఇంకా సంతకం చేయకపోవడం మరోసారి రాజకీయ రచ్చకు కారణమైంది.
ధర్నాలు, చర్చల తర్వాత.. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసేసింది సర్కారు. అంతమాత్రానికే ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం అయినట్టు కాదు. ఇంకా ప్రాసెస్ ఉంది. పాస్ అయిన బిల్లుపైనా గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, తమిళిసై ఇంకా ఆ బిల్లును ఆమోదించలేదు.
ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉండటంతో.. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపుతారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాజ్భవన్ వర్గాలు ఖండించాయి. ఆర్టీసీ బిల్లును న్యాయ సలహా కోసం న్యాయశాఖకు పంపినట్టు తెలిపాయి. గవర్నర్ సూచించిన సవరణలు, సూచనలు బిల్లులో పొందుపరిచారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకే న్యాయశాఖకు పంపినట్టు చెబుతున్నారు.
ఇక, రాజ్భవన్లో బిల్లు ఆలస్యం అవుతుండటంతో.. ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి ధర్నాలకు సమాయత్తమవుతున్నాయి.