TSPSC: ఇన్నాళ్లూ ప్రవీణ్, రాజశేఖర్లే అనుకున్నారంతా. సిట్ విచారణలో అంతకుమించి కేటుగాళ్లు బయటకొస్తున్నారు. డీఈ రమేష్ మహా ఖతర్నాక్గా తేలాడు. పేపర్ లీక్, కాపీయింగ్ కోసం ఓ హైటెక్ సెటప్ క్రియేట్ చేశాడు. 30 మందితో డీల్ మాట్లాడుకొన్నాడు. ఏకంగా 10 కోట్లు వసూల్ చేశాడు. అతని మాస్టర్ మైండ్కు సిట్ అధికారులే అవాక్కవుతున్నారు.
చాలా టాక్టీస్గా ఏఈ క్వశ్చన్ పేపర్ సంపాదించాడు విద్యుత్ శాఖలో డీఈగా చేస్తున్న రమేష్. ఓ ఎగ్జామ్ సెంటర్ ఇన్విజిటేలర్ను ట్రాప్ చేసి.. అతనికి ఏకంగా రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఇంకేం, ఓ పని చేసిపెడితే 20 లక్షలు వస్తాయంటే.. ఈజీగా కమిట్ అయిపోయాడు ఆ ఇన్విజిలేటర్. రమేష్ చెప్పినట్టే.. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఫోటో చేసి అతనికి ఫార్వర్డ్ చేశాడు. ఇలానే ఏఈతో పాటు డీఏవో పేపర్ను కూడా లీక్ చేశాడు రమేష్. ఒక్కో పేపర్కు.. ఒక్కో అభ్యర్థితో 20-30 లక్షలకు బేరం సెట్ చేసుకున్నాడు.
క్వశ్చన్ పేపర్ చేతికొచ్చింది సరే, మరి ఆన్సర్స్ ఎలా? అందుకోసం ముందుగానే ఓ కంట్రోల్ రూమ్ సైతం సెటప్ చేశాడు. సిమ్ కార్డుతో పనిచేసే చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్.. దానికి కనెక్ట్ చేసే అతిచిన్న బ్లూటూత్ డివైజ్. వాటి వాడకంపై అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. సిమ్ కార్డుతో ఉన్న ఆ పరికరాన్ని అభ్యర్ధులు లోదుస్తుల్లో దాచి.. సూక్ష్మంగా ఉండే బ్లూటూత్ రిసీవర్ను చెవిలో పెట్టుకున్నారు. అలా డీల్ కుదుర్చుకున్న అభ్యర్థులకు అత్యాధునిక బ్లూటూత్ డివైస్లు ఇచ్చి ఎగ్జామ్ హాల్కి పంపించాడు. వాటిని పసిగట్టడం చాలా కష్టం.
పరీక్ష స్టార్ట్ అవగానే ఇన్విజిలేటర్ పంపిన పేపర్కు.. చాట్ జీపీటీ ద్వారా ఆన్సర్లు తెలుసుకున్నాడు రమేష్. వాటిని కంట్రోల్ రూమ్ నుంచి ఎగ్జామ్ హాల్లోని వారికి బ్లూటూత్ డివైజ్ ద్వారా సమాధానాలు చెప్పాడు. పరీక్షరాస్తున్న అభ్యర్ధులకు ఫోన్ చేసి ఆన్సర్లు చెప్పడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకున్నట్టు చెబుతున్నారు. ఇలా పకడ్బందీగా పేపర్ లీక్, కాపీయింగ్కు పాల్పడ్డాడు రమేష్. గతంలో వరంగల్ విద్యుత్ శాఖలో డీఈగా పనిచేసిన రమేశ్.. ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఓ కోచింగ్ సెంటర్లో టీచింగ్ చేస్తున్న రమేష్.. తన దగ్గర కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతోనే డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.