TSPSC : పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళుతోంది. TSPSC బోర్డు సభ్యులను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఏడుగురు బోర్డు సభ్యులు స్టేట్ మెంట్ రికార్డు చేయనుంది. మరోవైపు బోర్డు సభ్యుడు లింగారెడ్డి దగ్గర పీఏ పనిచేస్తున్న రమేష్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రూప్ -1 పేపర్ ను రమేష్ లీక్ చేసినట్లు గుర్తించారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పెన్డ్రైవ్లో 15 ప్రశ్న పత్రాలను సిట్ గుర్తించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ – ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ – డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ – ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు – ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2 – టౌన్ ప్లానింగ్ – జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్డ్రైవ్లో లభ్యమయ్యాయి.ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభిస్తే పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది.