TSPSC Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన. తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు. ఎగ్జామ్ పేపర్లను పప్పుబెల్లాల్లా అంగట్లో అమ్మేసుకున్నారు దుర్మార్గులు. బావ కోసం ఒకడు.. పైసల్ కోసం ఇంకోడు.. అడ్డగోలుగా వ్యవహరించారు. క్వశ్చన్ పేపర్ దేశ సరిహద్దులు కూడా దాటించారంటే మాటలా. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు నిందితులు. ఇందులో కమిషన్ చేతగానితనం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎగ్జామ్ పేపర్లను ఓ కంప్యూటర్లో పెట్టి.. ఓ పాస్వర్డ్ పడేశారు అంతే. ఇంకేమీ సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోలేదు. ఇంకే. చాలా సింపుల్గా పాస్వర్డ్ సేకరించి.. 5 ప్రశ్నాపత్రాలను దొంగిలించారు. ఒక్కొక్కరి నుంచి పేపర్కు 10 లక్షలు దండుకున్నారు. నిందితులంతా ఇంటి దొంగలే కావటం మరింత దారుణం.
ఇలా లీకేజ్ మేటర్ అంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. కానీ, పేపర్ లీకేజీపై ఏర్పాటైన సిట్ విచారణ మాత్రం నత్తనడకగా సాగుతోంది. హైకోర్టు సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారంటూ సిట్ను ప్రశ్నించింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నెలన్నర అవుతున్నా సిట్ దర్యాప్తు ఎందుకు పూర్తికావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిట్ దర్యాప్తు వేగంగా జరగడం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుత దశలో దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని విచారించామని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం వెయిట్ చూస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా? లీకేజీతో ఎంతమంది లబ్ధి పొందారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. జూన్ 5 న దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 5కి వాయిదా వేసింది.
మరోవైపు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాజకీయంగానూ తీవ్ర ప్రకంపణలు రేపుతోంది. సిట్పై నమ్మకం లేదని.. సింగిల్ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ పట్టుబడుతోంది. నిరుద్యోగ మార్చ్లతో లీకేజీ అంశాన్ని ప్రజల్లో ఎండగడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు.. ఈ కేసులో బాధ్యుడిని చేస్తూ మంత్రి కేటీఆర్ను కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే, సీబీఐ విచారణ కోసం కాంగ్రెస్.. సింగిల్ జడ్జి ఎంక్వైరీ కోసం బీజేపీ పట్టుబడుతున్నాయి. మధ్యలో సిట్ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఇంకా స్పీడ్ పెంచాలంటూ హైకోర్టు సూచించింది.