TSPSC: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
వీటి అమలు కోసం ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమశాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని రూపొందించారు. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల అమలు కోసం సంబంధించిన ఫైల్ను సీఎం రేవంత్కు పంపించాయి. నేడు మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక ఏజెన్సీల ఫలితాలను ఉత్తర్వులు వచ్చిన పది రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టంచేసింది. చట్టపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ల ప్రకారం లక్ష్యాలను సిద్ధం చేసి ఫలితాలను ప్రకటించాలని నియామక ఏజెన్సీలను కోరింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏఈఈ, ఏఈ, గ్రూప్-4 ఫలితాలు యుద్ధప్రాతిపదికన వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది.
గురుకుల నియామక సంస్థ పరిధిలో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల ఫలితాలను వారం రోజుల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్నారు. మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలుస్తోంది.
మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుందని సమాచారం. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించనుంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు, వాటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా మునుపటి తేదీ నుంచి ఇవ్వనుంది. దీంతో నియామకాల్లో న్యాయపరమైన వివాదాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.