Notices Issued to 9 Blood Banks: హైదరాబాద్లోని పలు బ్లడ్ బ్యాంకులు గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్న అక్రమ దందాలపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 9 బ్లడ్ బ్యాంకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
నగరంలోని మలక్పేట, చైతన్యపురి, లక్డీకపూల్, హిమాయాత్ నగర్, సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు విరుద్ధంగా నాసిరకం పరికరాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అంతే కాదు రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాల ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని సేకరిస్తారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు రక్తాన్ని అందజేయాల్సి ఉంటుంది. కానీ నగరంలో పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు.
Read More: గద్దెనెక్కిన సమ్మక్క.. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ తమిళిసై..
దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. కానీ దానిని బ్లడ్బ్యాంకుల నిర్వాహకులు అసలు పట్టించుకోవడం లేదు. సేకరించిన రక్తంలో ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో కూడా లోపాలు ఉన్నాయి. దీంతో రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు బ్లడ్ బ్యాంకులపై దాడులు చేశారు.