TS Sarpanch Palana : తెలంగాణలో సర్పంచ్ పాలన ముగిసి అధికారుల పాలన సాగనుంది. నేటి నుంచి సర్పంచ్ల ఎన్నికలు జరిగే వరకూ గ్రామాల పాలనంతా స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉండనుంది. ఇందుకోసం ఇప్పటికే పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12 వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ గ్రామాలను ఏలిన ప్రధాన పౌరులైన సర్పంచ్లందరూ తమ పదవీకాలం ముగియడంతో మాజీలయ్యారు. అయితే.. ఎన్నికలకు సమయం ఉండటంతో తమ పదవీకాలాన్ని పొడగించాలంటూ హైకోర్టు ఆశ్రయించారు సర్పంచ్లు. వారి పిటిషన్పై విచారించిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరిగే దాకా గ్రామాల్లో అభివృద్ధి, సాధారణ పాలన విధులన్నింటినీ ప్రత్యేక అధికారుల చేతిలోనే ఉండనుంది.
గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనతో ఎల్లుండి ప్రత్యేక అధికారుల పాలన, వేసవిలో తాగునీటి సరఫరా, రోడ్లకు మరమ్మతులు వంటి అంశాలపై మంత్రి సీతక్క, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో జిల్లా కలెక్టర్లు సహా పంచాయతీ రాజ్ సెక్రటరీల వరకూ పాల్గొననున్నారు. సమావేశంలో విధివిధానాలను ఖరారు చేయనుంది సర్కార్.
.
.