TS MLC Elections : తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ ను ఈసీ జారీ చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారిద్దరు గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో ఇప్పుడు ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉంది.
ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. శాసనసభ్యుల బలాబలాల మేరకు రెండు సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. సీపీఐతో కలిపి కాంగ్రెస్కు 65 మంది బలం ఉండగా.. బీఆర్ఎస్కు 39 మంది మాత్రమే ఉండటంతో 2 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
.
.