Ts Govt: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు ఐదు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4 లక్షల మందికి.. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. అలాగే ఒక్కో లబ్ధి దారుడికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందివ్వనున్నారు. ఈ పథకానికి రూ. 12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
అలాగే ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధం ఇవ్వాలని .. ప్రతి ఏటా ఆగష్టు 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్లో ప్రారంభించి ఆగష్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మంత్రి వర్గం ఆదేశించింది.
అతి త్వరలోనే అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,55,393 మందికి పోడు భూముల పట్టాలను త్వరలోనే అందివ్వనున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులందరినీ ఈవేడుకకు ఆహ్వానించి అందరి సమక్షంలో గొప్ప పండుగలా విగ్రహాన్ని ఆవిష్కరించాలని నేతలు నిర్ణయించారు. అలాగే కాశీలో తెలంగాణ ప్రభుత్వ పక్షాణ ఓ వసతి గృహం నిర్మించాలని నిర్ణియించారు. ఇందుకోసం రూ. 25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.