Congress: తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ ప్రజల తరఫున పోరుబాట పట్టనుంది. రైతు కేంద్రంగా ప్రభుత్వంపై పోరు సలపాలని నిర్ణయించింది. పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడేలా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కార్యచరణ సిద్ధం చేశారు.
ఈనెల 21న టీపీసీసీ ఆధ్వర్యంలో సీఎస్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. 24న అన్ని మండలాల్లో నిరసనలు, 30న నియోజకవర్గ కేంద్రాల్లో, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత గవర్నర్కు వినతిపత్రం ఇస్తారు. ఇందిరాపార్క్ దగ్గర రెండ్రోజులు దీక్ష చేయనున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించేలా ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ నిర్ణయించింది. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములను సీలింగ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని తప్పుబట్టారు.
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా టీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. గతంలోనూ నయీం కేసు, డ్రగ్స్ కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నా.. తదితర అంశాలను వివాదాస్పదం చేసి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించారని గుర్తు చేశారు. ఈ సారి అలాకాకుండా.. పోడు భూములు, ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఈ జూమ్ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గైర్హాజరు అయ్యారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్బాబు, కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్ నేతలు అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ తదితరులతో హైదరాబాద్ గాంధీభవన్లో జూమ్ మీటింగ్ జరిగింది.