MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంట్లోకి చొరబడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.
ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై విమర్శలు గుప్పించారు. ఆమె పార్టీ మారతారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందుకే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తన నివాసంపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్లో లేరు. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.