Sharmila: తెలంగాణను దోచుకోవడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందని.. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమంటూ మండిపడింది టీఆర్ఎస్. తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ మాలోతు కవిత విమర్శించారు. ఆంధ్రాలో పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు ఆడుతుందని, షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదని హెచ్చరించారు.
తెలంగాణలో షర్మిలకు కె.ఎ. పాల్ కన్నా తక్కువ ఓట్లు వస్తాయంటూ ఎద్దేవా చేశారు ఎంపీ కవిత. తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా.. కేవలం వ్యక్తిగత విమర్శలతో షర్మిల దిగజారుతున్నారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హామీల గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణకు వ్యతిరేకమేనని, గతంలో మానుకోట ఘటనలో జగన్ను వంగపల్లి దాటనివ్వలేదని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే షర్మిల ఇక్కడ ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడతామన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం షర్మిలకు ఇష్టం లేదన్నారు. ఓదార్పు యాత్రలు ఇప్పుడు ఏపీకి చాలా అవసరమని.. అందుకే ఆమె ఏపీలో ఓదార్పు యాత్ర చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. 2004లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ తండ్రి వైఎస్ కొన్నారని.. మీకు లాగా దొంగ కేసులతో జైలుకు వెళ్లిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి లేదంటూ ఎమ్మెల్యే సునీత విరుచుకుపడ్డారు.